ఒకే వేదికపైకి కేసీఆర్, జగన్.. ప్రోగ్రామ్ ఏంటో తెలుసా?

by Nagaya |
ఒకే వేదికపైకి కేసీఆర్, జగన్.. ప్రోగ్రామ్ ఏంటో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఆసక్తికరంగా సాగుతున్న వేళ ఓ న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే కార్యక్రమానికి హాజరుకాబోతున్నారని ప్రచారం జోరందుకుంది. విశాఖలోని శారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సైతం ఆహ్వానం అందినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ నెల 28న జగన్ శారదా పీఠానికి వెళ్లనుండగా అదే సమయంలో కేసీఆర్ సైతం అక్కడికి వెళ్లి రాజశ్యామల యాగంలో పాల్గొంటారనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరితో పాటు పంజాబ్, హర్యానా, తమిళనాడు గవర్నర్లు కూడా ఈ యాగంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అయితే కేసీఆర్ హజరుపై స్పష్టమైన క్లారిటీ లేనప్పటికీ శారదా పీఠంతో ఆయనకు ఉన్న అనుబంధం, పైగా ఇది ఎన్నికల సమయం కావడంతో ఆయన ఈ యాగంలో తప్పక పాల్గొంగారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే జగన్, కేసీఆర్ ఒకే రోజు శారదా పీఠానికి వస్తే ఇది రాజకీయంగా ఆసక్తికర పరిణామమే అవుతుంది. గతంలో వీరిరువురి మధ్య సంబంధాలు బాగానే ఉన్నా ఆతర్వాతి కాలంలో కృష్ణా జలాలు, పొతిరెడ్డిపాడు వివాదాల కారణంగా కేసీఆర్-జగన్ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా ఆవిర్భావం చెందడం, ఏపీలో పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచిస్తుండటంతో బీఆర్ఎస్, వైసీపీ నేతల మధ్య వ్యవహారం హాట్ హాట్‌గా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్, కేసీఆర్ ఒకే కార్యక్రమానికి హాజరు అవుతారా? ఒక వేళ యాగానికి అటెండ్ అయితే ఇద్దరు నేతల మధ్య ఏదైనా చర్చలు జరుగుతాయా అనేది ఉత్కంఠగా మారింది.

Also Read...

కొండగట్టులో Pawan Kalyanకు గజమాలతో స్వాగతం

Next Story